ఆరుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్ వెళ్తున్న ముగ్గురు దొంగలను, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు దొంగలు రెండు బైక్ లపై పారిపోతుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఫేసు కు మాస్క్ ,తలపై క్యాపు ,చేతులకు గ్లౌజులు వేసుకొని వెళ్తుండగా వీరంతా పట్టుబడ్డారు. దొంగతనం చేసిన బైక్ లనే దోపిడీకి వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దోపిడీ వెనుక అంతర్-రాష్ట్ర ముఠాల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మంగళవారం ఉదయం షాపు తెరిచిన వెంటనే ముసుగులు ధరించిన ఆరుగురు దుండగులు షాపులోకి చొరబడ్డారు. తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. గాల్లోకి, అలాగే డిప్యూటీ మేనేజర్ కాలిపై కాల్పులు జరిపారు. అందినకాడికి దోచుకుని అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, ప్రదర్శనలో ఉన్న వెండి ఆభరణాలను దోచుకుని పారిపోయారు. ఈ కేసును ఛేదించడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నారు.