Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 May 2025, 1:13 pm Posted by : ramakrishna

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోవు

. పిచ్చి ప్రేలాపసనలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి

. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హితవు

హైదరాబాద్, బతుకమ్మ: కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని, ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారని, రేవంత్ పరిపాలన తో విసుగు చెందుతున్న ప్రజలే ఆయన రాజకీయ ఆనవాళ్లను తెలంగాణ నుంచి శాశ్వతంగా చెరిపేస్తారని హెచ్చరించారు.

కేసీఆర్ కట్టిన అద్భుత కట్టడాలు సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం, అమరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, టీ హబ్ వంటి ఎన్నో ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి తరం కాదన్నారు. దిగజారుడు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు మాని.. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలు పరిపాలన పై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

ధాన్యం కొనేవారు లేక అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక బాధతో కల్లాల మీద రైతులు ప్రాణాలు వదులుతుంటే, జీతాలు సరిగా రాక చిన్న ఉద్యోగులు ప్రతి రోజూ నిరసనలు తెలుపుతున్నా, రాష్ట్రంలో విచ్చల విడిగా క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అంతా బాగున్నట్టు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో మునిగి తేలుతున్నాడని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.