. . . వేములవాడలో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
. . . కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ :
ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీని చీకట్లో చిరుదీపంలా ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధికి పునాది వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వేములవాడ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను “తరుగు” పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించిన ఆయన, పంట కోత సమయంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రతి బూత్లో మెజారిటీ సాధించేలా కృషి చేయాలని సూచించిన కేటీఆర్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. దొంగ, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ తొలి అంకం పూర్తిగా విఫలమైందని, రెండో అంకంపై కూడా ప్రజలకు విశ్వాసం లేదన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని, దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 15 లక్షల పెళ్లిళ్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందని ఆరోపించారు. రైతుబంధును బలహీనపరిచి “రాహుల్ బంధు”ను ప్రారంభించారని, తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ నెల 25వ తేదీ తర్వాత వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండాను ఎవరూ అడ్డుకోలేరని, మరో రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ టీ. జీవన్ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మేడ లక్ష్మీనర్సింహా రావు, బీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
