- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి, బతుకమ్మ : బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆరేనని జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఎక్సైజ్ మంత్రి జూపల్లి కరెక్టేనని అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆ అప్పులకు ప్రతి నెల ఈ ప్రభుత్వం వడ్డీ కడుతోందని న్నారు. అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామన్నారు. ప్యాకేజీ–22 పనులను ప్రభుత్వం త్వరలోనే పూర్తి చేస్తుందన్నారు. భూసేకరణ నిధుల కోసం ఇరిగేషన్ మంత్రిని షబ్బీర్ అలీ కలిశారని చెప్పారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందని, అమెరికా మాట విని మధ్యలోనే ఆపరేషన్ ఆపడం సరికాదని అన్నారు. నాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిందని గుర్తు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ,డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.