ఫీజు రీయెంబర్స్ మెంట్ కోసం విద్యార్థులతో కవిత ర్యాలీ
హన్మకొండ, బతుకమ్మ :
ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఒకసారి ఇంటర్మీడియట్ విద్యా విధానం తీసేస్తానని అంటారని, ఇంకోసారి పాలిటెక్నిక్ ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం అంటారని అన్నారు. విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించక పోవడంతో లక్షలాది మంది డిగ్రీలు, ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసినా సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు పొందలేక పోతున్నారన్నారు. ఫీ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఈ ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు.