Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 7:17 pm Posted by : ramakrishna

కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

 

. . . ఎమ్మెల్యే కేవీఆర్ అవినీతి కింగ్

 

. . . నాపై ఒక్క మరక లేదు: షబ్బీర్ అలీ

 

. . . ​పట్టణ అభివృద్ధికి రూ.300 కోట్ల ప్రత్యేక నిధులు

 

. . . మార్చి నాటికి తీరనున్న తాగునీటి కష్టాలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నూతన మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, కౌన్సిలర్లతో కలిసి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలు, పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక ఎమ్మెల్యే తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ​ఎన్నికల వరకే పార్టీలు.. ఆ తర్వాత సమిష్టి కృషితో కామారెడ్డిని అభివృద్ధి చేసుకుందామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మద్దతుతో కలిసి 22 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల అండతో ఉమారాణి చైర్మన్ గా ఎన్నికయ్యారని, వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్కిందని ఆయన వివరించారు. అందరం కలిసికట్టుగా పట్టణాన్ని అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. ​కామారెడ్డి అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తున్న నేపథ్యంలో, కామారెడ్డికి కూడా రూ.500 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని తెలిపారు. ​ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం, ప్రత్యేక నిధుల కింద రూ.300 కోట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చారని వెల్లడించారు. ​ఇప్పటికే పట్టణంలో రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ​పట్టణ ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా దూరం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 80 కిలోమీటర్ల మేర అంతర్గత పైప్‌లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మార్చి చివరి నాటికి తాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడతామని, వచ్చే నెలలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. అలాగే వీధి వ్యాపారులకు సరైన ఉపాధి చూపిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని మానవీయ కోణంలో స్పందించారు. ​స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే మాటిమాటికి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, నిజానికి ఆయనే అవినీతి కింగ్ అని, రైతులు డిగ్రీ కళాశాల కోసం సేకరించిన భూములను అరోరా కళాశాలకు అప్పజెప్పిన చరిత్ర ఆయనదన్నారు. ఆ భూమి పై కాలేజీ వాళ్ళు నేడు రూ.18 కోట్లు అప్పు చేశారని, ఇది అవినీతి కాదా ? అని ప్రశ్నించారు. ​తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని, 45 ఏళ్లలో తనపై ఒక్క చిన్న కేసు కూడా లేదని గుర్తు చేశారు. గతంలో కేవీఆర్ కు రాజకీయ జన్మనిచ్చింది తానేనని, ఆయనకు ఎమ్మెల్సీ బి-ఫారం ఇస్తే టికెట్ అమ్ముకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆకాశం మీద ఉమ్మితే అది మన మొహం మీదే పడుతుందని ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అలాగే ​కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రజలు హర్షించేలా పనిచేయాలని, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనకు మంచి పేరు తెచ్చేలా, పారదర్శకమైన పాలన అందించాలని నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.

 

 

Kamareddy Municipality won by Congress