Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 6:37 pm Posted by : ramakrishna

గందరగోళం మధ్య వాయిదా పడిన కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం గందరగోళ పరిస్థితుల మధ్య ఎలాంటి అభివృద్ధి అంశాలపై చర్చలు జరగకుండానే వాయిదా పడింది. సమావేశంలో ఎజెండా అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి కొన్ని రోజుల ముందు అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన సమావేశంలో శానిటేషన్, రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ సమస్యలు వంటి ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలనే ఎజెండాలో చేర్చాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే, ఆ నిర్ణయానికి విరుద్ధంగా మళ్లీ వివిధ బిల్లులకు సంబంధించిన అంశాలను ఎజెండాలో చేర్చారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డిసెంట్ నోటీసు కూడా ఇచ్చినట్లు బీజేపీ సభ్యులు వెల్లడించారు. సర్వసభ్య సమావేశం ప్రారంభమైన అనంతరం శానిటేషన్, చెత్త సేకరణ ట్రాక్టర్ల నిర్వహణ వంటి ప్రజా సమస్యలపై ముందుగా చర్చించాలని బీజేపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. దీంతో సమావేశాన్ని తొలుత 15 నిమిషాల పాటు వాయిదా వేయగా, అనంతరం మధ్యాహ్న భోజన విరామం తర్వాత తిరిగి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. చివరకు సాయంత్రం 4.40 గంటలకు సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించినట్లు బీజేపీ సభ్యులు తెలిపారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా కాపాడటమే తమ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామని బీజేపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు.  ఈ ఆరోపణలపై మున్సిపల్ చైర్మన్ లేదా అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

 

Kamareddy municipal general body meeting adjourned amidst chaos.