Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 8:17 pm Posted by : ramakrishna

కల్వకుంట్ల కవిత సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

అమరుల ఆశయ సాధన, సంపూర్ణ తెలంగాణ వికాసం అనే నినాదంతో ఈనెల 25న కొత్త రాజకీయ అధ్యాయానికి కల్వకుంట్ల కవిత నాంది పలకనున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మామిండ్ల రాజు, గుల సత్యం ఆధ్వర్యంలో సభ వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అమరుల ఆశయాల సాధన లక్ష్యంగా కొత్త పార్టీ ముందుకు వస్తోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని పేర్కొన్నారు. సభను విజయవంతం చేసేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సుమారు 50 వాహనాల ద్వారా కార్యకర్తలు, అభిమానులను హైదరాబాద్‌కు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, ఇది కొత్త పార్టీ ఆవిష్కరణకు కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బహిరంగ సభతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పడుతుందని, ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.