కులగణన లెక్కలకు చట్టబద్ధత
గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధం
సమగ్ర సర్వేపై కేసీఆర్ కాకిలెక్కలు చెప్పారు
సీఎం రేవంత్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : కుల గణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పకడ్బందీగా కుల గణన నిర్వహించామని, సర్వే పూర్తయ్యాక ఇంటి యజమాని సంతకం తీసుకున్నామన్నారు. అంత ఆషామాషీగా చేసిన సర్వే కాదన్నారు. 50 రోజులు, లక్షకుపైగా ఎన్యూమరేటర్లు, 36 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పక్కాగా ఇంటింటి సర్వే చేశామన్నారు. గతంలో సమగ్ర సర్వేపై కేసీఆర్ కాకిలెక్కలు చెప్పారని విమర్శించారు. గతంలో ఎక్కడా ఆ సర్వే వివరాలు అధికారికంగా చెప్పలేదని గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ సమాచారాన్ని వాడుకున్నారని విమర్శించారు. 25 రోజులు రాహుల్ గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేసి కులగణన తప్పకుండా చేస్తామని మాట ఇచ్చారని, గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. రాహుల్ హామీ మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. బీసీ సంఘాలు డిమాండ్ చేయకముందే రాహుల్ గాంధీ కులగణన చేస్తామని ప్రకటించారన్నారు. జనాభా లెక్క తేల్చి అన్ని రంగాల్లో వారికి సమాన న్యాయం చేయాలనే రాహుల్ కులగణన ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ కుల గణన బీసీలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అని అన్నారు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలదే అన్నారు. రాజకీయ ప్రేరేపితానికి లోనైతే బీసీలు శాశ్వతంగా నష్టపోతారన్నారు. బీసీల లెక్కతేలితే నష్టపోయే రాజకీయ శక్తులే వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. బీసీ లెక్కలు తేల్చిన మాపై ఆరోపణలు చేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే అని వ్యాఖ్యనించారు. కులగణన లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు.