నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్ కు నిజామాబాద్ జర్నలిస్టులు మద్దతు తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర బంద్ కు జర్నలిస్టులు సంఘీభావం తెలుపుతూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభమైన జర్నలిస్టుల ర్యాలీ ధర్నాచౌక్ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అంతడ్పుల రామకృష్ణ, బైర శేఖర్ లు మాట్లాడుతూ బీసీల జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. తెలంగాణలో ప్రభుత్వం బీసీల కులగణన చేసి అశాస్త్రీయంగా జీవోలు ఇవ్వడంతో వాటిని న్యాయస్థానాలు తోసిపుచ్చాయన్నారు. ప్రభుత్వాలు తలుచుకుంటే జీవోలు అమలు అనేవి సాధ్యమేనన్నారు. ఇప్పటికే చాలా జీవోలు ప్రజల అవసరాలకన్నా వారి రాజకీయ అవసరాల కోసం వచ్చాయని వాటికి లేని అడ్డంకులు బీసీ రిజర్వేషన్లకు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పాల్గొన్నట్లుగానే సామాజిక కోణంలో బీసీలకు జర్నలిస్టులకు మద్దు తెలుపుతున్నామన్నారు. ఈ ర్యాలీలో జర్నలిస్టులు జమలా పూర్ గణేష్, పాకాల నర్సింలు, సుభాష్ వాగ్మారే, తాళ్ళ శ్రీధర్, రాజేష్, శ్రీకాంత్, కృష్ణ, షేక్ హైమద్, పబ్బ భూమేష్, ఆమందు ప్రవీణ్, శ్రీను, విజయ్ తదితరులున్నారు.
