Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 6:30 pm Posted by : ramakrishna

విడిసి ల ఆగడాలపై ప్రజాసంఘాల ఉమ్మడి గళం

 

. . .జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రౌండ్ టేబుల్ సమావేశం

. . . ప్రజా సంఘాల ద్వార ప్రజాభిప్రాయ సేకరణ

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీల చట్ట విరుద్ధ కార్యక్రమాలు, పెత్తందారి పోకడలు, సామాజిక బహిష్కరణలు, వెలివేతలపై ప్రజల జీవనానికి ఎదురవుతున్న ప్రమాదాలను ఎలా అరికట్టాలి అనేది ప్రజా సంఘాల బాద్యుల నుండి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ మంగళవారం అభిప్రాయ సేకరణ నిర్వహించింది. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ లో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు వివిధ ప్రజా సంఘాల నేతలతో సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీల తీరుతెన్నులతో ప్రజాసమూహాలు పడుతున్న భాదలు, వారి జీవనానికి ఎదురవుతున్న ముప్పును ప్రముఖ సామాజిక కార్యకర్త, సీపీఐ (ఎమ్. ఎల్ )మాస్ లైన్ నేత వి. ప్రభాకర్ విప్పి చెప్పారు. ప్రజలతో మమేకం కావలసిన విడిసి లు, ప్రజా వ్యతిరేక చర్యలకు ఒడిగడుతున్నాయని అన్నారు.చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్న విడిసిలపై చట్టం ప్రకారమే చర్యలు ఉండాలని ఆయన విన్నవించారు. సీనియర్ న్యాయవాది బాస రాజేష్వర్ సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తున్న విడిసిల పనితీరు పెను ప్రమాదకరంగా మారిందని అన్నారు. విడిసి లలో అన్ని కులాల వ్యక్తులు ఉన్నారని, వారిలో మార్పుకు ప్రయత్నాలు చేయాలని మాజీ జడ్పిటిసి సావెల్ గంగాధర్ అభిప్రాయం వెలిబుచ్చారు. బంగారు సాయిలు మాట్లాడుతు విడిసి ల ఆధిపత్యంలో సమీదలు దళితులేనని అన్నారు. విడిసి ల అకృత్యాలకు మహిళలు ఎక్కువ మూల్యం చెల్లిస్తున్నారని, బలి అవుతున్నారని మహిళ నేత గుజ్జ రాజేష్వరి పేర్కొన్నారు.సామాజిక కార్యకర్తలు పెద్ది వెంకట్రాములు, శంకర్, అల్గొట్ రవీందర్, నర్రా రామారావు తదితరు పలు ప్రజా సంఘాల అభిప్రాయాలు విని, సేకరించుకున్న సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అందరి సూచనలు అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేసుకుని చట్టాసమ్మతమైన పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని అన్నారు.రౌండ్ టేబుల్ సమావేశానికి సందాన కర్తగా బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు వ్యవహారించారు.

Joint voice of public organizations on VDCs' actions