- స్థానిక ఎన్నికలకు సమాయత్తం పై దిశానిర్దేశం
- కుద్వాన్ పూర్ వంతెన పరిశీలన
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు సభలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. మారంపల్లి, నూత్ పల్లి, కుద్వాన్ పూర్, మనోహరబాద్, గంగాసరం గ్రామాలతో పాటు ఆర్మూర్ పట్టణంలో జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమై గ్రామాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆరాతీశారు. ప్రతీ గ్రామంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉందని పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకువచ్చా రు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు పదేళ్ల బీ ఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు విడమర్చి చెప్పాలని దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించేలా పార్టీ నేతలు కృషి చేయాలని ఆయన చెప్పారు. కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంతో పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు. బీఆర్ఎస్ కు త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ఆపద సమయంలో పార్టీకి అండగా ఉన్న నేతలు, కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా అనేక గ్రామాలకు వెళ్లిన ఆయన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తల ఇండ్లకు వెళ్ళి వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు శుభ కార్యక్రమాలకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్ మండలం లోని కుద్వాన్ పూర్ వంతెనను జీవన్ రెడ్డి పరిశీలించారు.
