నిజాంసాగర్, బతుకమ్మ :
మహమ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ శివారులో గల 70 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొరం తవ్వకాల కోసం ఉపయోగిస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకుని మహమ్మద్నగర్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఒక రైతు ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు మొరం మట్టిని తవ్వించి విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.