. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
. . . శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ లలో ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభం
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన ఔషధి పథకం ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక నిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన ఔషద కేంద్రంలోని మందుల నిల్వలు, సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజలు ఎక్కువ ఖర్చుతో మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు అదే నాణ్యత కలిగిన ఔషధాలు 50% నుండి 90% వరకు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కేంద్రంలో 2000 కు పైగా నాణ్యమైన జనరిక్ ఔషధాలు, 300 కు పైగా సర్జికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు, వృద్ధులకు, పేద కుటుంబాలకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తమవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వేలాది జన ఔషధి కేంద్రాలు ప్రారంభమవుతున్నాయని, ఆరోగ్య సేవలను ప్రతి కుటుంబానికి చేరవేయడం లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ ధరలో నాణ్యమైన మందులు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నియోజకవర్గంలో మరిన్ని జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జన ఔషధి కేంద్ర యజమానులు రాథోడ్ ఆశ, రాథోడ్ అక్షయ్ లకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించే ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి, సుధ, 45వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ, వేణు, 19 డివిజన్ కార్పొరేటర్ నాగోల్లా లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు, ప్రభాకర్, పవన్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
