Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 6:10 pm Posted by : ramakrishna

ఆగస్టు 15 లోపు “జలసిరి” పనులను పూర్తి చేయాలి

 

. . . అదనపు కలెక్టర్ వి.భుజంగరావు

 

. . . ఈ నెల 28న మండల స్థాయి సభలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా గ్రామగ్రామాన జలసిరి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ నెల 28న అన్ని మండలాలలో మండల స్థాయి సభలు నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. అదేవిధంగా 29, 30 తేదీలలో గ్రామ పంచాయతీల స్థాయిలో గ్రామ సభలు జరపాలని అన్నారు. ఈ సభలలో ఎల్ నినో ప్రభావం గురించి, జల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేలా వీబీజీ రామ్-జీ పథకం కింద విరివిగా ఇంకుడుగుంతలు, ఊట కుంటలు, పంట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టి జాబ్ కార్డు కలిగిన కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని గ్రామాలలో ఈ పనులు పూర్తయ్యేలా ప్రణాళికాబద్దంగా కృషి చేయాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఎం.పీ.డీ.ఓలు, ఎం.పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఏ.ఈ.ఓ లు, వీ.ఓ లు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు ఇలా అందరినీ భాగస్వామ్యం చేస్తూ నిర్ణీత గడువు లోపు జలసిరి కార్యక్రమాలు అమలయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. వాటర్ షెడ్ నిర్మాణాల ద్వారా నీటి సంరక్షణ జరగడంతో పాటు కూలీలకు ఉపాధి కల్పించి పని దినాల లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రతి రోజు సగటున 60 మందికి పని కల్పించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు దోహదపడే జలసిరి కార్యక్రమాల అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా వీ.ఓ భవన నిర్మాణ పనులను కూడా నవంబర్ 15 లోపు పూర్తి చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

"Jalasiri" works must be completed by August 15.