
తులం బంగారం కావాలని చేతులెత్తిన మహిళలు
. ఆడ బిడ్డల తరఫున ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నరు
. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, బతుకమ్మ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పెది నెలలైందని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీపై నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తులం బంగారం హామీని అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి విన్నవించాలని సూచించారు. వేల్పూర్, బాల్కొండ మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ప్రశాంత్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో మేనమామ కట్నంగా కేసీఆర్.. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారందరికీ చెక్కులతోపాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరఫున తులం బంగారం కావాలని అన్నవారు చేతులెత్తాలని ఎమ్మెల్యే కోరడంతో కార్యక్రమానికి హాజరైన మహిళలందరూ చేతులెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను ఎగ్గొట్టిందని, ప్రతి మహిళకు ఇస్తామన్న రూ.2,500 ఇవ్వడం లేదని, కేసీఆర్ కిట్ ను ఆపేశారని, వృద్ధులు, వింతతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా రూ.లక్షా 50వేల కోట్లతో ఎవరికీ పనికిరాని మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులను నిలదీసిన మహిళలు

కార్యక్రమంలో ముగిసిన అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెళ్లిపోయారు. ఆయన వెళ్లగానే అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులను మహిళలు తులం బంగారం విషయమై నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయని, ఇస్తామన్న తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులను మహిళలు నిలదీశారు.