Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 8:28 pm Posted by : ramakrishna

తరుగు లేకుండా తూకాలు వేస్తున్నామని చెప్పడం సిగ్గు చేటు

 

. . . భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాద్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి

 

బాల్కొండ, బతుకమ్మ :

 

రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తరుగు లేకుండా, తూకాలు వేస్తున్నామని, జోకిన వెంటనే రైస్ మిల్ కు పంపిస్తున్నామని ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం సిగ్గు చేటని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాద్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలపై బుధవారం బాల్కొండ మండలం తహసీల్దార్ కి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 60 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగలేదన్నారు. కొనుగోలు కేంద్రాలలో కుప్పలన్ని ఎక్కడికక్కడే ఉండిపోయాయన్నారు. ఇదే కాకుండా ఒక క్వింటాల్ కు 8 నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారన్నారు. ఇప్పటికి గన్ని బ్యాగులు, లారీలు, హమాలీల కొరత వల్ల రైతులందరూ సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే గన్ని బ్యాగులను, లారీలను, హమాలీలను తెప్పించి, తూకాలు వేసి తరుగు లేకుండా పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నరసయ్య, కిసాన్ మోర్చా నాయకులు చిన్నయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.