Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 5:32 pm Posted by : ramakrishna

జయశంకర్ బీసీ బిడ్డ కావడం గర్వకారణం

  • బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆచార్య జయశంకర్ సిద్ధాంతాలు, మార్గదర్శకత్వం లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయ్యేది కాదని, జయశంకర్ ఒక బీసీ బిడ్డ కావడం ప్రతి బీసీ సమాజానికి గర్వకారణమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఆత్మగౌరవ పోరాట పథ నిర్దేశకుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి అందించిన సైద్ధాంతిక భరోసా, ఆయన నిస్వార్థ సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన సుమారు 1,200 మంది అమరవీరుల్లో అత్యధికులు బీసీ వర్గాలకు చెందిన వారేనని అన్నారు. తెలంగాణ నిర్మాణంలో బీసీల పాత్రను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, అపర్ణ, చంద్రకాంత్, శ్రీనివాస్, నరసయ్య, రేఖ, అనిల్, సత్యనారాయణ, సదానంద్ తదితర బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.