Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:51 pm Posted by : ramakrishna

ప్రధాన రహదారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

 

. . . వర్షపు నీటి కుంటలోనే కౌన్సిలర్ల వినూత్న నిరసన

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోతున్న సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మినారాయణ శనివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కామారెడ్డి – కరీంనగర్ జాతీయ రహదారిపై (స్టేషన్ రోడ్) పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా నిలిచిన వర్షపు నీటిలోనే కుర్చీలు వేసుకుని కూర్చొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారిపై భారీగా నీరు నిలిచిపోతుందని, దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రహదారిపై నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే మార్గం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అత్యవసర సమయాల్లో 108 అంబులెన్సులు, రోగుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల అత్యవసర వైద్యం అందడంలో జాప్యం జరిగి ప్రాణనష్టం సంభవించే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్యను పరిష్కరించకపోతే రోడ్డుపైనే పూర్తిస్థాయి దీక్ష చేపడతామని కౌన్సిలర్లు హెచ్చరించారు.

 

Issues concerning the main road must be resolved immediately.