Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 5:53 pm Posted by : ramakrishna

ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి

 

. . . టీజీవిపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ అన్నారు. ఈ మేరకు టీజీవిపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా నోడల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు సరిపడా బెంచీలు లేవని, కళాశాల గ్రౌండ్ ఉన్నప్పటికీ వర్షాలు కురిసిన సమయంలో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే కొన్ని కళాశాలల్లో మౌలిక వసతులు సరిగ్గా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సంజయ్ తెలిపారు. కళాశాలల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరినట్లు చెప్పారు. సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే జిల్లా కేంద్రంలో ధర్నాలు చేపట్టి ఆందోళనలు ఉధృతం చేస్తామని టీజీవిపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండి సమీర్ ఖాన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.