హైదరాబాద్, బతుకమ్మ :
అక్టోబర్ 11న దుబాయ్లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిర్వాహకులు ఆహ్వానించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దుబాయ్లో ఘనంగా నిర్వహించేందుకు గల్ఫ్ తెలంగాణ ఫోరమ్, ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తున్నాయి. జీటీఎఫ్ ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆదివారం హైదరాబాద్ లోని కేటీఆర్ నివాసంలో కలిసి దుబాయ్లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ఆహ్వానపత్రాన్ని అందజేశారు. తెలంగాణ ఆడపడుచులు,ప్రవాస తెలంగాణ కుటుంబాలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని వారు కేటీఆర్ను ప్రత్యేకంగా కోరారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని గల్ఫ్ దేశాల్లోనూ కొనసాగించడంతో పాటు, అక్కడి తెలంగాణ సమాజంలో తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు జీటీఫ్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత, చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కేటీఆర్ ను కలిసిన వారిలో గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, జయంత్ కుమార్, అభినవ్, ఆకుల కళ్యాణ్, లత తదితరులు పాల్గొన్నారు.
