. గ్రాడ్యుయేట్ల సభ అండర్ గ్రాడ్యుయేట్లతో..
. పార్టీ కార్యకర్తలూ కరువే..
. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రచార కార్యక్రమం అట్టర్ ఫ్లాప్
బోధన్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాలులో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్లతో నిర్వహించిన సమావేశంలో గ్రాడ్యుయేట్లు కరువయ్యారు. అండర్ గ్రాడ్యుయేట్ల(ఇంటర్ విద్యార్థులతో) సమావేశం కొనసాగగా.. సమావేశానికి సంబంధం లేకుండా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రసంగం సాగిందని, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడాల్సిన కిషన్ రెడ్డి ఎంత సేపూ కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబంపై మాట్లాడడటం, హామీల అమలుపై ప్రభుత్వాన్ని సరిగా నిలదీయకపోవడంపై పార్టీ నాయకులు పెదవి విరించారు. ప్రారంభం నుంచి శాసన మండలి, ఉపాధ్యాయులూ అంటు సాగిన కిషన్ రెడ్డి ప్రసంగం ఎటువైపు వెళ్లిందో అర్థం కావడం లేదంటున్నారు. మరో వైపు జన సమీకరణకు నాయకులు అపసోపాలు పడ్డారు. అదే సమయంలో కార్యకర్తలు కూడా లేకపోవడంతో ఇంటర్మీడియెట్ విద్యార్థులతో సమావేశం కొనసాగించారు. బీజేపీపై యువతలో ఉన్న పాజిటీవ్ థాట్ ను ఓట్లు గా మల్చుకోవడంలో వెనుకబడి పోతున్నామని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల జోష్ ఏ మాత్రం కనిపిచలేదని, కనీసం సమావేశానికి హాజరయ్యేందుకు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపలేదని అంటున్నారు. గ్రాడ్యుయేట్ల సమావేశం లాభం లేకపోగా నష్టం కలిగించే విధంగా ఉందంటున్నారు.

నీ పాలనపై చర్చించేది ఏముంది..?
తమ 14 నెలలపాలనపై చర్చిద్దామని సీఎం రేవంత్ సవాళ్లు విసిరే బదులు తన చుట్టూ ఉన్న ఉద్యోగులు, డ్రైవర్లను అడిగితే పాలన ఎలా సాగుతుందో.. హామీలు ఏ మేరకు అమలయ్యాయో చెబుతారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాలులో శనివారం పట్టభద్రులతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యనంతరం ఉపాధ్యాయుల సమస్యలను వినిపించేందుకు ఏర్పడిన శాసన మండలి ప్రాధాన్యత 2014 నుంచి కేసీఆర్ సీఎం అయిన తరువాత తగ్గిందన్నారు. ఉపాధ్యాయులపై సమస్యలపై మాట్లాడేవారు లేకుండాపోయారు. మీ గుండె చప్పుడు వినిపించే వ్యక్తి మండలికి వెళ్లాలని, ఉపాధ్యాయులు ఆ దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాత్రమే ఉపాధ్యాయ నియోకవర్గం నుంచి పోటీ చేస్తోందని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని విస్మరించిందని, ప్రతి విద్యార్థికి రూ.5లక్షల విద్యాభరోసా కార్డు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. పోరాటాలు, త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఇక్కడి ప్రజలు, అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను రక్షించుకోవాల్సి అవరసం ఉందని, కేసీఆర్ పోయి రేవంత్ వస్తే మార్పు కాదని, మంచి ప్రభుత్వం వస్తేనే మార్పు సాధ్యమన్నారు. తెలంగాణలో డబల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు.
