నవీపేట, బతుకమ్మ: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ర్ట బైక్ దొంగలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. నవీపేట పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని నిజాంకాలనీకి చెందిన తహసీన్ ఖాన్, భారతీరాణి కాలనీకిచెందిన సయ్యద్ సోహెల్ ఇద్దరు కలిసి పలుచోట్ల బైక్ చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నవీపేటలోని కుమార్ గల్లీకి చెందిన పట్లి అశోక్ బైక్ గంగా వైన్ షాపు ముందు నుంచి చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెంజల్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన తహసీన్ ఖాన్, సయ్యద్ సోహెల్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. నాలుగు రోజుల క్రితం నవీపేటలోని గంగా వైన్ షాప్ ముందు పార్కింగ్ చేసి ఉన్న హీరో హెచ్ఎఫ్ డిలక్స్ మోటార్ సైకిల్ ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అంతేకాకుండా నవీపేట్ లో ఐదు బైక్ లు , రెంజల్ లో ఒకటి, బోధన్ పట్టణంలో ఒకటి, బాసర లో ఒక బైక్ ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి మొత్తం రూ.4లక్షల 70వేల విలువైన పదకొండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. బైక్ చోరీల కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
