నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్ కుటుంబానికి ₹75,00,000/- లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా గతంలో ట్రెసా ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల కు ఇన్సూరెన్స్ చేయించారు. దానిలో భాగంగా ఈ చెక్ సోమవారం పంపిణీ చేశారు. అదే విధంగా ట్రెసా అనుబంధంగా నిజామాబాద్ రెవెన్యూ ఉద్యోగుల సేవా సంస్థ “హెల్పింగ్ హార్ట్స్” ఆధ్వర్యంలో బీడీఎస్విద్యార్థి ఓంకార్ కు ₹25,000/- ల ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ డైరీ ను కూడా అతిథులు ఆవిష్కరించారు.

ముందుగా ట్రెసా జిల్లా అధ్యక్షులు రమన్రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రెవెన్యూ ఉద్యోగుల కు ఇన్సూరెన్స్ చేయించడం ద్వారా అత్యవసర సమయాల్లో ఆదుకోవాలని నిజామాబాద్ జిల్లా ట్రెసా ప్రయత్నం చేస్తుందని, గతంలో ఒక ఉద్యోగి మరణించిన సందర్భంలో కోటి రూపాయలను అందించామని తెలిపారు. అదేవిధంగా ఈ మధ్య ముఖ్యమంత్రి ఉద్యోగుల కు ఆక్సిడెంటల్డెత్విషయంలో కోటి రూపాయల ఇన్సూరెన్స్, సాదారణ మరణాల విషయంలో 10 లక్షలు చెల్లించే విధంగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీమహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ గుండె లాంటిదని, ప్రభుత్వ విజయాలకు రెవెన్యూ శాఖ కీలకం అని చెపుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న నిజామాబాద్ ట్రెసా కార్యవర్గాన్ని అభినందించారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ హెల్త్ ఇన్సురెన్స్విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి క్యాష్ లెస్ హెల్త్ కార్డ్స్ఇవ్వడానికి ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ట్రెసా సభ్యత్వం ఉన్న ఈ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల కు సేవలందేలా ట్రెసా కృషి చేస్తుందని ప్రకటించారు. రెవెన్యూ శాఖ లో గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న 632 మంది ఔట్సోర్సింగ్ ఆపరేటర్లను కొనసాగించాలని, 61 సం. ల పైబడిన వీఆర్ఎల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న వీఆర్ఏల కారుణ్య నియామకాలు తదితర విషయాలను ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు. స్పందించిన ముఖ్య అతిథులు వీలయినంత త్వరగా ముఖ్యమంత్రి తో ట్రెసా సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర నాయకులు రాజ్కుమార్, రామకృష్ణారెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రెసా నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమన్రెడ్డి, ప్రశాంత్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్లు, పెద్ద సంఖ్యలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
