వెబ్ న్యూస్, బతుకమ్మ : బీహార్లో రాజకీయాలు మరోసారి తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివంగత తల్లిని దూషించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తేజస్వీ యాదవ్ బీహార్ అధికార్ యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మోదీ తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. తల్లులను, సోదరీమణులను అవమానించడమే లక్ష్యంగా కాంగ్రెస్- ఆర్జేడీల ర్యాలీలు నిర్వహిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. బీహార్ ప్రజలు దీన్ని మరచిపోరని, వీటన్నింటికీ గట్టిగా బదులిస్తారంటూ తేజస్వీ మాట్లాడిన వీడియోను కూడా బీజేపీ ’ఎక్స్‘ వేదికగా షేర్ చేసింది
ఖండించిన ఆర్జేడీ
బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆర్జేడీ పూర్తిగా ఖండించింది. బీజేపీ షేర్ చేసిన వీడియో మార్ఫింగ్ చేయబడిందని, తమ నాయకుడిని బద్నాం చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర అని ఆర్జేడీ పేర్కొంది. ఒకవేళ తమ పార్టీకి చెందిన ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, తాము దానిని తీవ్రంగా ఖండిస్తామని ఆర్జేడీ నేతలు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు జరిపించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ నేతలు డిమాండ్ చేశారు.