నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన సెల్ ఫోన్ లో స్నేహితుడు ఇన్ స్ట్రాగ్రామ్ ఐడిని క్రియేట్ చేసుకుని చాట్ చేసిన విషయంలో జరిగిన గొడవ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఐడి క్రియేషన్ పై స్నేహితుడితో జరిగిన వాగ్వివాదం గొడవకు దారి తీసి అతను గాయపడడంతో పోలీసు కేసుల వరకు వెళ్లడంతో యువకుడు గడ్డి మందు తాగాడు. దాదాపు 20 రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు సెల్ ఫోన్ లో తన స్నేహితుడే ఇన్ స్ట్రాగ్రామ్ యాప్ ద్వారా చాటింగ్ చేశాడు. ఈ విషయంలో ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. విశాల్ తన స్నేహితుడిని కొట్టడంతో చేయి విరిగి గాయమైంది. ఈ విషయంలో స్నేహితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు ఎందుకు రాజీ కుదుర్చుకోవాలని సూచించారు. ఇంటికి వచ్చిన విశాల్ జనవరి 16న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.