Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 9:20 pm Posted by : ramakrishna

హైదరాబాద్ డివిజన్‌ లోని పలు స్టేషన్ ల తనిఖీ

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ డివిజన్‌లోనీ పలు స్టేషన్ లను దక్షిణ మధ్య రైల్వే  జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవారం  (19 ఆకస్మిక  తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, కేంద్ర కార్యాలయం డివిజన్‌కు చెందిన ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ముద్ఖేడ్ నుండి మెడ్చల్ వరకు జరిగిన ఈ తనిఖీ లో , రైలు పట్టాల భద్రత, సాంకేతిక వ్యవస్థ, కొత్తగా అమర్చిన విద్యుదీకరణ వ్యవస్థలు, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించారు.

  • ఉమ్రి రైల్వే స్టేషన్ పరిశీలన..

ఉమ్రి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించిన జనరల్ మేనేజర్, స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని పరిశీలించి, స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అలాగే, రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, భద్రతా పరికరాల స్థితిగతులను పరిశీలించారు. ట్రాక్ నిర్వహణ కార్మికులతో మాట్లాడి, వారి పనిపరిస్థితులు, భద్రతా చర్యల గురించి వివరాలు తెలుసుకున్నారు.

Inspection of various stations in Hyderabad Division

  • బాసర రైల్వే స్టేషన్ పరిశీలన..

బాసర రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జనరల్ మేనేజర్, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ వినియోగం, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్  స్టాల్, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 11.33 కోట్ల వ్యయంతో చేపట్టిన స్టేషన్ పునర్నిర్మాణ పనులను సమీక్షించి, పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, గోదావరి రైల్వే వంతెనను పరిశీలించి, నిర్వహణ, భద్రతా చర్యలను సమీక్షించారు.

  • నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిశీలన..

నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జనరల్ మేనేజర్, ప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించారు. రూ. 53.3 కోట్ల వ్యయంతో చేపట్టిన స్టేషన్ పునర్నిర్మాణ ప్రణాళికలను పరిశీలించారు. స్టేషన్‌లో ఉన్న రన్నింగ్ రూమ్, క్రూ బుకింగ్ లాబీని తనిఖీ చేసి, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి సిబ్బందితో మాట్లాడారు. అలాగే, ప్రమాద నివారణ రైలు ను పరిశీలించారు. అనంతరం, జనరల్ మేనేజర్ మరియు ఇతర ఉన్నతాధికారులు, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు నాటిన మొక్కలను నాటే  కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిశీలన..

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లోని వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్‌ను పరిశీలించిన జనరల్ మేనేజర్, రూ. 39.9 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పునర్నిర్మాణ పనులను సమీక్షించారు. నిర్మాణ పనుల సమయంలో అనుసరించాల్సిన భద్రతా విధానాలను పరిశీలించారు. అనంతరం, కామారెడ్డి సెక్షన్‌లోని గేట్ నంబర్ 238 వద్ద గేటుమన్, ట్రాక్ నిర్వహణ కార్మికులతో మాట్లాడి, వారి విధి నిర్వహణపై అవగాహన పొందారు.

  • మనోహరాబాద్, మెడ్చల్ రైల్వే స్టేషన్లు..

మనోహరాబాద్ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జనరల్ మేనేజర్, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, స్టేషన్ పరిసర ప్రాంతాలు, స్టేషన్ ముఖద్వారాన్ని తనిఖీ చేశారు. అలాగే, మెడ్చల్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి, ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. రూ. 8.37 కోట్ల వ్యయంతో జరుగుతున్న స్టేషన్ పునర్నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. తనిఖీ సందర్భంగా, రైలు మార్గాల అభివృద్ధి సంబంధిత అంశాలపై పలు ప్రజా ప్రతినిధులు జనరల్ మేనేజర్‌కు వినతిపత్రాలను అందించారు.

Inspection of various stations in Hyderabad Division