ఎల్లారెడ్డి, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్, 2వ వార్డ్ కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మహేశ్వరి మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వార్డు ప్రజలందరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా రెండవ వార్డులో చేపట్టిన పారిశుధ్య పనులు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజూ నిర్వహిస్తామని చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో మున్సిపాలిటీలోని 2వ వార్డును ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వార్డులో ఎలాంటి సమస్య ఉన్నా ఒక ఫోన్ కాల్ చేస్తే 24 గంటలపాటు అందుబాటులో ఉంటామని, వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మహేష్ కుమార్తో పాటు కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, వార్డ్ ఆఫీసర్ అవినాష్, మున్సిపల్ సిబ్బంది ప్రశాంత్, బాలరాజు, కిషన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
