బాల్కొండ, బతుకమ్మ: పేద ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలని తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, కనీసం రేషన్ కార్డులలో పేర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నాయకులు ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకుండా అమ్ముకొని ప్రజలను మోసం చేశారని తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యాన్ని పంపిణీ చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తుందని ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కృతజ్ఞత భావంతొ ఉన్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాం సొంత ఇల్లు లేని కుటుంబాలు ఉండకూడదు అన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
