. . . బిఎల్ పి జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వేలాది నిరుపేద కుటుంబాలుకు ఇంటి స్థల పట్టాలు మంజూరు చేసి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అనంతం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలను ఆక్రమణదారులుగా పరిగణించకుండా, వారి వాస్తవ పరిస్థితులను గుర్తించి చట్టబద్ధమైన ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయాలని, అలాగే ఎన్నో సంవత్సరాలుగా అద్దె భారంతో జీవిస్తున్న అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా శాశ్వత గృహాలు కల్పించాలన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకంగా సమగ్ర సర్వే నిర్వహించి, నిజమైన అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కాంబ్లే మధు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న అర్హులైన పేదలందరికీ వెంటనే ఇంటి స్థల పట్టాలు మంజూరు చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయకుండా వారి గృహ హక్కును చట్టబద్ధంగా పరిరక్షించాలన్నారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫూలే అంబేడ్కర్ నగర్ నాయకులు శాంతా బాయి, కిశోర్, పద్మిని సమతా, ఊర్మిళ, లక్ష్మణ్ ఫూలే అంబేడ్కర్ నగర్ కు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
