– అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తరలింపు
– బరితెగించిన ఇసుకాసురులు
– అధికార పార్టీ అండదండాలు
– పట్టించుకోని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : జిల్లాలో అభివృద్ధి పనుల పేరిట మంజీరా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. బరితెగించిన ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక త్రవ్వకాలు చేపడుతున్నారు. మంజీరా నది నుండి పోతంగల్, కోటగిరి, రుద్రూర్ గ్రామాల మీదుగా వర్ని, బోధన్ వైపుకు ఉదయం 5 గంటల సమయంలోనే ఇసుకను అక్రమంగా టిపర్లలో అధిక లోడుతో తరలిస్తున్నారు.
అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తరలింపు …
అభివృద్ధి పనుల పేరిట అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగిస్తున్నారు. ఇసుక మాఫియాతో కొంతమంది అధికారులు కుమ్మక్కు కావడంతో జోరుగా దందా కొనసాగుతోంది. గతంలో అధికార బీఆర్ఎస్ నాయకుల అండతో యథేచ్ఛగా ఈ దందా సాగింది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి పాలయ్యింది. కానీ ఇసుక మాఫియాలో తమకున్న పట్టుతో ఇంకా దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
