. . . ప్రజలకు చేరువగా పార్టీ సేవలు అందించడమే లక్ష్యం
. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
గాంధారి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో గాంధారి మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ సోమవారం ఘనంగా ప్రారంభించా రు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం వారు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బలమని అన్నారు. ప్రజల సంక్షేమం, ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండే సేవా కేంద్రంగా ఈ నూతన కార్యాలయం నిలవాలని ఆకాంక్షించారు. డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. ఈ నూతన కార్యాలయం కార్యకర్తలకు మార్గదర్శక కేంద్రంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
