Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2025, 3:25 pm Posted by : ramakrishna

సులేమాన్ నగర్ లో అధికారులను నిలదీసిన గ్రామస్తులు

. . . గ్రామస్తులను  శాంతింపజేసిన ఏసీపీ

రుద్రూర్, బతుకమ్మ  :

రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి , సులేమాన్ నగర్ , రాయకూర్ గ్రామాలల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద బుధవారం ప్రజా పాలన గ్రామసభలను నిర్వహించారు. కాగా సులేమాన్ నగర్ గ్రామంలో అధికారులకు ప్రజలు చుక్కలు చూయించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాలపై అర్హులైన వారి పేర్లను అధికారులు చదివి వినిపించారు. అయితే ఈ పథకాలలో రేషన్ కార్డుల జాబితాలో 350 మంది దరఖాస్తులు చేసుకోగా, 96 మంది పేర్లు జాబితాలో వచ్చాయని, అవి కూడా అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. దీంతో గ్రామసభ రసవత్తరంగా సాగింది. అనంతరం బోధన్ ఏసిపి పి. శ్రీనివాస్ అక్కడికి చేరుకొని గ్రామస్తులను సముదాయించడంతో శాంతించారు. ఈ సందర్భంగా తహాసిల్దార్ తారాబాయి మాట్లాడుతూ జాబితాలో పేర్లు రాని వారు నిరాశ చెందవద్దని, ఈ పథకాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని, రెవెన్యూ సిబ్బందితో మళ్లీ సర్వే చేయించి ఈ పథకాలను అర్హులకు అందేలా చూస్తామని అన్నారు. ఈ గ్రామ సభలో ఏపిఓ రాజేశ్వర్, ప్రత్యేకాధికారిణి నిర్మల, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.