Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 4:35 pm Posted by : ramakrishna

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి

  • సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి, ప్రజలను అనారోగ్యాలతోటి కాపాడాలని డిమాండ్ చేస్తూ  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో  మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ నగరంలోని మెజారిటీ డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి పారిశుధ్యం పడకేసిందన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదన్నారు. డెంగ్యూ, మలేరియా ఇలాంటి విష జ్వరాల కేసులు పెరుగుతున్నాయన్నారు. కుక్కలు, కోతుల సమస్య నగరవాసులను తరచూ ప్రమాదాలకు గురిచేస్తుందన్నారు. డ్రైనేజీ పైప్ లైన్, తాగునీటి పైప్ లైన్ లు లీకేజీలకు గురై తాగునీరు కలుషితమవుతుందన్నారు. ఈ కలుషితమైన నీరు తాగి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు.   ఇప్పటికైనా పారిశుద్ధ్యం మౌలిక సౌకర్యాల కోసం ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి, వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలన్నారు. నగరంలోని 60 డివిజన్లలో  దోమల మందు ఫాగింగ్, పిచికారి రెగ్యులర్ గా చేయించాలన్నారు. సరిపడా యంత్రాలను, సామాగ్రిని అందివ్వాలని డిమాండ్ చేశారు. నగర శివారు,  లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలనీ,  డ్రైనేజీ, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలన్నారు. నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కోతులు, కుక్కల సమస్యను పరిష్కరించాలన్నారు. పైప్ లైన్ ల లీకేజీలను అరికట్టి, నగరవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సంధ్యారాణి, పి.డి.ఎస్.యు  జిల్లా ప్రధాన కార్యదర్శి కె.గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పార్టీ నగర నాయకులు విటల్, టియుసిఐ జిల్లా నాయకులు గంగాధర్, కిరణ్, నాయకులు అమూల్య, సాయిలు, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.