Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:51 pm Posted by : ramakrishna

పిటిషన్లపై తక్షణమే స్పందించాలి

 

. . . జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లకు అందించే ప్రతి పిటిషన్‌పై తక్షణమే స్పందించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశించారు. ప్రతి పిటిషన్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా సీసీటీఎన్ఎస్ లో నమోదు చేసి, ఫిర్యాదుదారులకు వెంటనే రశీదు అందించాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రిసెప్షన్ వర్టికల్ ట్రైనింగ్ కార్యక్రమం లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు పోలీస్ శాఖతో జరిగే తొలి పరిచయ వేదిక రిసెప్షన్ వర్టికల్ అని, అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే పిటిషన్లను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, చట్టపరమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందించే పోలీస్ సేవల్లో వేగం, పారదర్శకత, బాధ్యత ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సమయంలో వారి ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, అవసరమైన సహాయం అందిస్తూ సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.నరసింహారెడ్డి, సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసెప్షన్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు.