Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 November 2024, 3:17 pm Posted by : ramakrishna

రాత్రి వేళలో యాథేచ్చగా కలప అక్రమ రవాణా

  •  వాల్టా చట్టానికి తూట్లు
  •  జిల్లా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కలప అక్రమ రవాణా 
  • పట్టించుకోని అధికారులు 

రుద్రూర్, బతుకమ్మ: పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అటవీ, రెవెన్యూ శాఖ అధికారుల అలసత్వంతో ఈ అక్రమదందా జోరుగా సాగుతోంది. కలపకు ఇటుక బట్టీలు, సుద్ద పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు చెట్లను నరికి రాత్రి వేళల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది దళారులు పంట పొలాల్లో అనుమతులు లేకుండా చెట్లను నరికి రాత్రిళ్లు మహారాష్ట్ర నుండి పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం రాత్రి రుద్రూర్ మీదుగా బోధన్ వైపుకు లారీలో అక్రమంగా కలప తరలిస్తున్నారు. అంతేకాకుండా మండల కేంద్రంలోని చుట్టూ ప్రక్కల గ్రామాల్లోని గుట్ట ప్రాంతంలో అనుమతులు లేకుండా చెట్లను నరికి వేస్తూ ట్రాక్టర్, లారీలలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వం హరితహరం పేరిట ఖర్చు పెట్టిన కోట్ల రుపాయల వృథా అవుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

వాల్టా చట్టానికి తూట్లు..

మండల పరిధిలో అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది కలప వ్యాపారులు అక్రమ సంపాదనే ధ్యేయంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఇష్టారీతిగా, చెట్లను నరికి ఇటుక బట్టీలకు, టింబర్ డిపోలకు తరలిస్తున్నారు. పెద్దవూర మండల పరిధిలోని కోదాడ జెడ్చర్ల జాతీయ రహదారిపై బట్టుగూడెం వెళ్లేదారిలో కొత్త బ్రిడ్జి వద్ద గత నెల రోజులుగా అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొంతమంది అటవీ అధికారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని, వాల్టా చట్టానికి చరమగీతం పాడుతున్నారు. వేలాది చెట్లు, ఇటుక బట్టీలకు సామిల్ టింబర్ డిపోలకు తరలిస్తూ, ఇల్లీగల్ దందా నడుపుతున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అడవులు, హరితహారంకు సంబంధించిన మొక్కలు వీరి కంటినపడితే, ఖతమైనట్లుగానే వ్యవహరిస్తున్నారు. భారీగానే కలప అక్రమ నిల్వలు ఉన్నప్పటికీ వాటిపై సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.