Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 2:45 pm Posted by : ramakrishna

ఓయో రూమ్‌ కేంద్రంగా ఇల్లీగల్ దందా

 

. . .  సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) అక్రమ రవాణా మరోసారి కలకలం రేపింది. యువతను లక్ష్యంగా చేసుకుని, ఓయో రూమ్‌లను అడ్డగా మార్చుకుని గంజాయి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు రట్టు చేశారు. కొండాపూర్‌లోని ఓయో హైలెట్స్ హోటల్‌పై నిర్వహించిన ఆకస్మిక దాడిలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన ధీరజ్ దాస్, రబాలి అలీలుగా పోలీసులు గుర్తించారు. రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు కొండాపూర్‌లోని ఓయో హైలెట్స్ హోటల్‌పై మెరుపు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా నగరంలోని ఐటీ ఉద్యోగులు, యువతను టార్గెట్ చేస్తూ ఈ దందా నడుపుతున్నట్లు విచారణలో తేలింది.

. . .  విచారణలో వెలుగుచూసిన నిజాలు

అస్సాం నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఈ నిందితులు.. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు రద్దీగా ఉండే ప్రాంతాల్లోని ఓయో రూమ్‌లు, లాడ్జీలను ఆశ్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే దురాశతో అమాయక యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ఈ ముఠా కార్యకలాపాలపై పోలీసులు నిఘా మరింత కఠినతరం చేశారు. మత్తు క్షణాల ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, దానివల్ల జరిగే నష్టం జీవితాంతం వెంటాడుతుంది. యువత ఒక్క క్షణం ఆలోచించి ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.