- యథేచ్చగా టిప్పర్లలో మొరం అక్రమ రవాణా
రుద్రూర్, బతుకమ్మ : మొరం అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మొరం మాఫియా రోజురోజుకూ కొత్తరూపం దాల్చుతోంది. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మొరం అక్రమ తవ్వకాలు చేపడుతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా భూముల చదును పేరిట అక్రమంగా మొరం త్రవ్వకాలు చెపడుతూ టిప్పర్లలో మొరం తరలిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమ మొరం దందా జోరుగా కొనసాగుతుంది. ఒక్కో ట్రిప్పు మొరానికి రూ.2500 నుంచి రూ.3000 వరకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అక్రమ మొరం దందాకు అడ్డుకట్టవేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
