Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 7:00 pm Posted by : ramakrishna

హై బీపీని నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం

 

. . . డా. జగదీష్ చంద్ర బోస్, (కార్డియాలజిస్ట్), డా.ఆనంద్ మాలు, (జనరల్ ఫిజీషియన్)

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రస్తుతం అధిక రక్తపోటు సమస్య అన్ని వయస్సుల వారిలో వేగంగా పెరుగుతోందని, ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అధిక ఉప్పు, ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా.జగదీష్ చంద్ర బోస్ అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా డా.జగదీష్ చంద్ర బోస్, డా. ఆనంద్ మాలు (జనరల్ ఫిజీషియన్) మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రజల్లో హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హై బీపీని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారని, చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండె, రక్తనాళాలను నెమ్మదిగా దెబ్బతీస్తుందని వివరించారు. రక్తపోటు నియంత్రణలో లేకపోతే గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాపాయ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. డా. ఆనంద్ మాలు మాట్లాడుతూ ప్రస్తుతం యువతలో కూడా హైపర్‌టెన్షన్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. సరైన నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, ధూమపానం, మద్యపానం వల్ల చిన్న వయస్సులోనే బీపీ సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. తలనొప్పి, అలసట, తల తిరగడం, మసక చూపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇద్దరు వైద్యులు మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. రక్తపోటును నియంత్రించడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఉప్పు తగ్గించడం, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం అవసరమని సూచించారు. వైద్యుల సలహా లేకుండా బీపీ మందులను మధ్యలో ఆపేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. మెడికవర్ హాస్పిటల్ లో హైపర్‌టెన్షన్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయాలు, ఈసీజీ, 2డీ ఈకో, పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు.