ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి
తెలంగాణ హరితవనం కావాలి
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నాది
వన మహోత్సవం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : మనం ప్రకృతిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవం -2025 కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి అని పిలుపునిచ్చారు. తెలంగాణ మొత్తం హరితవనం కావాలన్నారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు రానున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంటిని అద్భుతంగా నడిపే ఆడబిడ్డలు రాజ్యాన్ని కూడా నడుపుతారనే నమ్మకముందన్నారు. వనంపెంచితేనే మనం క్షేమంగా ఉంటామన్నారు. పిల్లలు తమ తల్లులు పేరుమీదుగా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం అటవీ శాఖ, హెచ్ఎండీఏ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం తిలకించారు.
