Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 8:43 pm Posted by : ramakrishna

ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతా

  • పార్టీ పెడితే ప్రజలకు మేలు జరగాలి
  • 25 నుంచి 4 నెలల పాటు ‘జనం బాట’
  • ప్రజాభిప్రాయం తెలుసుకోవటానికే ‘జనం బాట’ కార్యక్రమం
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

యాదగిరిగుట్ట, బతుకమ్మ : ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జాగృతి నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘పార్టీ పెడితే ప్రజలకు మేలు జరగాలి. 25 నుంచి 4 నెలల పాటు ‘జనం బాట’. ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోవటానికే ‘జనం బాట’ కార్యక్రమం. అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటాం. ‘జనం బాట’ కార్యక్రమానికి లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సుల కోసమే వచ్చాం. మొన్న తిరుపతి, ఇప్పుడు యాదాద్రి దేవాలయాలను దర్శించుకున్నాం. ఈ నెల 25 నుంచి చేపట్టనున్న ‘జనం బాట’ కార్యక్రమానికి ఎలాంటి  అవాంతారాలు రాకుండా చూడాలని స్వామి వారిని కోరుకున్నాం.  ప్రజా సమస్యలను  అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలనే దైవ దర్శనం చేసుకుంటున్నాం. ఈ నెల 25 నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి ‘జనం బాట’ కార్యక్రమం మొదలవుతుంది. 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటాం. మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తాం. వారు చెప్పే సమస్యలను అర్థం చేసుకొని…వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలన్న దానిపై దృష్టి పెడతాం. ప్రజలతో కూలంకషంగా మాట్లాడేందుకు జాగృతికి ఈ కార్యక్రమం వేదికగా మారనుంది.

If the people want it, I will definitely form a political party.

 

తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు యాదాద్రిని చక్కగా పునర్నిర్మించారు. యాదాద్రి ప్రాశ్యస్తాన్ని కాపాడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మేము వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్ లను చూశాం. అలా కాకుండా తిరుమలలో మాదిరిగా స్వామి వారి హోర్డింగ్ లు చిత్రపటాలే ఇక్కడ ఉండేలా చూడాలి. మళ్లీ యాదాద్రికి వస్తాం. అప్పుడు ఇక్కడున్న అన్ని సమస్యలపై వివరంగా మాట్లాడతా. తెలంగాణ జాగృతి ఎన్జీవో గా పుట్టి 19 ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాలను కూడా గతంలో మేము మాట్లాడాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు మాట్లాడటం జరిగింది. సివిల్ సోసైటీ సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతాం. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తాం. అందులో ఇబ్బందేమీ లేదు. ఏపీ లో మూడు, తమిళనాడు లో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేరళలో గల్లీకి ఒక పార్టీ ఉంది. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదు. వాటి వల్ల ప్రజలకు మేలు జరగాలి. నేను పార్టీ పెడితే నాకు లాభం కాదు. ప్రజలకు మేలు జరిగేందుకు ప్రయత్నిస్తా. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ‘జనం బాట’ ద్వారా వారిని కలిసేందుకు వెళ్తున్నాం’’ అని అన్నారు.