Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 5:00 pm Posted by : ramakrishna

తల్లి బిడ్డకు సరైన పోషణతో ఆహారం ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు

  • ఆరోగ్యవంతమైన రాష్ట్ర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: తల్లి బిడ్డకు సరైన పోషణతో ఆహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. గురువారం గుండారం గ్రామంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, తల్లులు, చిన్నారులకు గుడ్లు, పాలు, బాలామృతం, స్నాక్స్ వంటి నాణ్యమైన ఆహార పదార్థాలను అందజేస్తోందని చెప్పారు. సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్ర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 33 అంగన్వాడి భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాత భవనాలకు మరమ్మత్తులు, లైటింగ్, బాత్రూములు, వంటగదుల సదుపాయాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు పంపించామని, త్వరలో అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మినీ అంగన్వాడి సెంటర్లలో పనిచేస్తున్న టీచర్లను అప్గ్రేడ్ చేసి సమాన వేతనాలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నర్సరీ తరగతులను ప్రారంభించబోతోందని, నర్సరీ నుండి నాలుగవ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. తరువాత పోషకాహార పదార్థాలు తయారు చేసిన అంగన్వాడి టీచర్లకు బహుమతులు ప్రధానం చేశారు. గర్భిణీల శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని పండ్లు, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ , ఐసీడీఎస్ పీడీ రసుల్ బీ, ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

If the mother feeds the child with proper nutrition, they will be healthy.