నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రమాద లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించి, సమర్థవంతంగా నిర్వహణ చేసినప్పుడే మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి. రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు మంగళవారం గంగస్థాన్ లోని ఐఎంఏ హాల్ లో ప్రమాద లక్షణాలు గల గర్భిణీ స్త్రీల గుర్తింపు, నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా శిక్షణ కేంద్ర ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వినయ్ కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి రాజశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి ఆషా కార్యకర్త గృహ సందర్శనలో గర్భిణీ స్త్రీలను నమోదు చేయాలని, హై రిస్క్ గల గర్భిణీలను ప్రత్యేకంగా గుర్తిస్తూ తరచూ ఫాలో అప్ చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి ఏఎన్ఎం వద్ద గర్భిణీ స్త్రీల జాబితా ఉండాలని, ప్రతి గర్భిణీ స్త్రీ మదర్ ఇన్ మదర్ అవుట్ సమాచారాన్ని ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుంటూ ప్రమాద లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను ప్రసవం అయ్యేంతవరకు ఫాలో అప్ చేయాలనన్నారు. ముఖ్యంగా 12 వారాల లోపు గర్భిణీ స్త్రీల నమోదు, ఎత్తు, బరువు, జ్వరం, రక్తహీనత, ప్రమాద సంకేతాలను గుర్తించి తదనుగుణంగా ప్రసవ ప్రణాళిక చేయాలన్నారు. శిక్షణలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి ప్రమాద లక్షణాలైనా గుండె జబ్బులు, ఎపిలేప్సీ, క్షయ, హెచ్ఐవి వంటి వాటితో పాటు గర్భిణీల్లో సంభవించే హైపర్ టెన్షన్, మధుమేహం, రక్తహీనత, శ్వాసలో ఇబ్బంది, జాండిస్, పిండ కదలికలో తగ్గుదల, మానసిక వ్యాధులు, తీవ్రమైన రక్తస్రావం, పిండ ఎదుగుదల లేకపోవడం, మొదలగు అంశాలతో పాటు ఎల్ఎమ్ఎస్ యాప్ పై ఈ సమావేశంలో శిక్షణనిచ్చారు. మంగళవారం నిజామాబాద్ డివిజన్ ఏఎన్ఎం లకు, బోధన్ డివిజన్ నుండి నాలుగు పీహెచ్ సీల ఏఎన్ఎంలకు శిక్షణనిచ్చినట్లు, జిల్లాలోని అందరూ ఏఎన్ఎంలు, వైద్యాధికారులకు విడతలవారీగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కావ్య, డాక్టర్ శర్వాణి, పిఓడిటిటి డాక్టర్ వినయ్ కుమార్, హెచ్ డబ్ల్యు ఈఈఓ జాహిద్ హఫీజ్, డిపిహెచ్ఎన్ఓ సరళ, డీసీఎం వినోద్ హాజరయ్యారు.
