నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలం జడ్పిహెచ్ఎస్ అచ్చంపేట్ కాంప్లెక్స్ పరిధిలోని మాగి హేబిటేషన్ పరిధిలో బడి బయట పిల్లలను గుర్తించామని సీఆర్పీ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా సి ఆర్ పి శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం మండల విద్యాధికారి పర్యవేక్షణలో బడి ఈడు పిల్లలు బడి బయట ఉండకుండా బడిలోనే ఉండేలా వారిని గుర్తించి బడిలో చేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. అందులో భాగంగా గురువారం మాగి గ్రామంలో 9వ తరగతి చదువుతూ మధ్యలో బడిమానేసిన విద్యార్థిని గుర్తించడం జరిగిందన్నారు. ఆ విద్యార్థినిని సంక్రాంతి సెలవుల అనంతరం స్థానిక నిజాంసాగర్ కస్తూర్బా బాలిక పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కాంప్లెక్స్ పరిధిలోని అన్ని హాబిటేషన్లో ఈనెల 30 తారీఖు వరకు కొనసాగుతుందన్నారు. 15 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు విద్యను మానివేసిన వారికి ప్రత్యేకంగా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశం కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే 5 నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులను గుర్తించి స్థానిక పాఠశాలలో చేర్పించడం జరుగుతుందన్నారు. కావున బడి ఈడు పిల్లలను తమ తల్లిదండ్రులు బడిలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాగి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సమీనా బేగం పాల్గొన్నారు.