Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 6:52 pm Posted by : ramakrishna

జానపద, ఉద్యమ కళాకారులకు అండగా ఉంటా

  • వారి హక్కుల సాధన కోసం ఉద్యమిస్తా
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులకు అండగా నిలుస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ వారసత్వ జానపద కళారూపాలను కాపాడుతూ రేపటి తరాలకు తెలియజేస్తోన్న కళాకారులు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగించడం విచారకరమన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒగ్గు డోలు, కోలాటం, బుర్రకథ, ఒగ్గు కథ, చిందు యక్షగానం, బంజారా కడ్డి తంత్రి, కూన పులిపటం, శారద కథలు, హరికథ, గోండి, తోటి, ఆదివాసీ, కిన్నెర తదితర జానపద కళారూపాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక పాలసీ రూపొందించి అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ జానపద కళారూపాలను కళాకారులు ప్రదర్శించారు. కల్వకుంట్ల కవిత కళాకారులతో పాటు గొంతు కలిపి పాటలు పాడారు. కార్యక్రమంలో తెలంగాణ జానపద సకల కలల పరిరక్షణ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ మురళీధర్ దేశ్ పాండే, వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు.

I will support folk and movement artists