- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, మంజీర నదిలో పెరిగిన వరద ప్రవాహాల కారణంగా రైతుల పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాగిరెడ్డిపేట్ మండలంలోని చిన్నూర్, బంజారా తండా గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో వందల ఎకరాల పంటలు నీటమునిగిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తక్షణమే స్పందించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ సీఈ, డీఈ లతో కలిసి గ్రామాలను సందర్శించారు. అక్కడ నీటమునిగిన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రైతులను కలసి వారి నష్టాల వివరాలు సేకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. “ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటం నా బాధ్యత. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుఖంగా ఉంటుంది. రైతుల సమస్యలు నా సమస్యలే. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా జిల్లా యంత్రాంగాన్ని కదిలిస్తాను” అని స్పష్టం చేశారు.
- నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల..
మంజీర నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే, రాష్ట్ర చీఫ్ ఇంజనీర్, కామారెడ్డి జిల్లా సీఈ, డీఈలతో మాట్లాడి, వరద ముప్పును తగ్గించేందుకు 1.5 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల అవసరమని సూచించారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు చేపట్టేందుకు అంగీకరించారు.
- రాష్ట్రానికి నివేదిక పంపిన ఎమ్మెల్యే..
ఈ పరిస్థితిని రాష్ట్ర మంత్రివర్గానికి తెలియజేసేందుకు ప్రత్యేక నివేదిక ను పంపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు.
పర్యటనలో ఎమ్మెల్యే మదన్ మోహన్ తో పాటు ప్రభుత్వ అధికారులు, ఆర్డీఓ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి ఆందోళనలు విన్నారు. ప్రతి ఒక్కరికీ తగిన సాయం అందించేలా కృషి చేస్తానని మరోసారి భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం మొత్తం మీద పంట పొలాల నష్టాన్ని అంచనా వేయడానికి అధికార యంత్రాంగం కదిలింది. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ముందుండి పర్యవేక్షిస్తున్నారు. “రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుఖంగా ఉంటుంది” అన్న ఆయన మాటలు రైతులకు ధైర్యాన్నిచ్చాయి.
