. . . తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని త్వరలోనే పెట్టబోతున్నా
. . . చేయని తప్పుకు నాలుగేళ్లు మానసికంగా వేధించారు
. . . తెలంగాణ ప్రాంత పరిరక్షణ, అస్తిత్వం హక్కుల కోసం పోరాటానికే పార్టీ పెడుతున్నా
. . . బీఆర్ఎస్, బీజేపీ లు ప్రతిపక్షాలుగా వైఫల్యం చెందాయి
. . . ఆంధ్రా ప్రజలంటే ద్వేషం లేదు . . . ఆంధ్రా రాజకీయ నాయకుల పెత్తనాన్ని మాత్రమే ద్వేషించాం
. . . తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ డెస్క్, బతుకమ్మ :
తెలంగాణలో త్వరలోనే పార్టీ పెట్టబోతున్నాం, మా పార్టీకి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమల వెంకటేశ్వస్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చినట్లు మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సందర్భంగా తిరుమల మెట్లమార్గం ద్వారా కాలినడకన వెళ్లే ముందుగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా బేధభావాలు లేకుండా మంచి చేసే పార్టీ పెడుతున్నామని, పార్టీ పెట్టిన తర్వాత కూడా కొత్త కార్యక్రమాలు చేపడతానని, మళ్లీ స్వామి వారి ఆశీస్సుల కోసం వస్తానన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమస్యలు తీర్చకుండా ఉండే పార్టీ మాది కాదని, నిరంతరం ప్రజల్లో ఉంటూ మైక్రో లెవల్ లో ప్రజల సమస్యలపై పోరాడుతామన్నారు. తెలంగాణ ఫస్ట్ , తెలంగాణ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తామన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకునే మానవతావాదులన్నారు.

ఆంధ్ర ఆధిపత్యం, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే మేము వ్యతిరేకించామన్నారు. ఆంధ్రా ప్రజలంటే మాకు ఎప్పుడూ ద్వేషం లేదని, రాజకీయ నాయకుల ఆధిపత్యంపై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఆంధ్రా, తెలంగాణలో ఎవరు కూడా ప్రజలపై ఆధిపత్యం చెలాయించ వద్దని, రెండు రాష్ట్రాలు విడిపోయాయి, ఎవరి బాటన వారు అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆంధ్రా ప్రాంతంలోని ఆదినారాయణ, ప్రతాప్, కిషోర్ యాదవ్ తదితరులు జాగృతి కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. నేను చేయని తప్పునకు నాపై నాలుగేళ్లుగా అవాకులు, చెవాకులు వాగుతూ నన్ను నా కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేశారన్నారు. నిజాయితీగా ఉన్న మాకు దేవుని ఆశీస్సులు ఉండటంతో ఆ కేసును కోర్టు కొట్టివేసిందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో లీగల్ గా పోరాటం చేస్తామని,నీతి, నిజాయితీ గా ఉండే వాళ్లకు తప్పకుండా దేవుని ఆశీస్సులు ఉంటాయన్నారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, ఆంధ్రాలో మా శ్రేయోభిలాషులు కూడా వచ్చారన్నారు. ఎప్పుడు తిరుమలకు వచ్చిన మాకు మంచి జరుగుతుంది, మూడు నెలల క్రితమే స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. బీఆర్ఎస్బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని, ఈ కారణంగానే ఒక్క హామీ నెరవేర్చకపోయినా సరే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుందన్నారు. కచ్చితంగా ప్రజలు అలర్ట్ నేట్ కోసం చూస్తున్నారు. బీఆర్ఎస్బీజేపీలు ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేసిన సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, పూటకొక స్టాండ్ మార్చుకునే పార్టీలను ప్రజలు విశ్వసించరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేము చాలా ఆలస్యంగా బరిలోకి దిగినప్పటికీ 40 స్థానాలు ఇచ్చామని, రాజకీయ పార్టీ అంటే ఆ ప్రాంత ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు, అస్తిత్వం, హక్కుల కోసం పనిచేయాలన్నారు. ఎన్నికలు ధ్యేయంగా కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యూత్ ను బీఆర్ఎస్ పూర్తిగా విస్మరించిందన్నారు.బీఆర్ఎస్ విస్మరించిన వర్గాల అజెండానే మేము ముందుకు తీసుకొని వెళ్తామన్నారు. నేను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తానని నా కుమారుడు అనలేదని,అనని మాటలను మీడియా దయచేసి ప్రసారం చేయవద్దన్నారు. కొత్తదనంతో ముందుకు వెళ్తేనే కొత్త పార్టీలకు మనుగడ ఉంటుందన్నారు. తిరుమలలో కల్తీ లడ్డు విషయంలో తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని, వెంకటేశ్వర స్వామి వారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉంటారని, టీటీడీ విషయంలో ప్రజలకు విశ్వసనీయత కలిగించేలా ఇక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
