బాన్సువాడ, బతుకమ్మ : తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లనని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని తనకు ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు చెప్పారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు. తిమ్మాపూర్ వెంకన్న ఆలయానికి వచ్చి తడి బట్టలతో ప్రమాణం చేద్దామని ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం సవాల్ విసిరారు. నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని తనకు పీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ఏనాడూ చెప్పలేదన్నారు. అందరినీ కలుపుకుని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి గణేశ్, కొత్తకొండ భాస్కర్, ఎలమంచిలి శ్రీనివాస్ రావు, కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.