- 2022లో నవోదయ కేటాయిస్తే జిల్లాలో ఏర్పాటుపై ఎంపీ చేసిన కృషి ఏది
- రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ :
కేంద్రం ప్రతిపాదించిన నవదోయ విద్యాలయంను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్ పల్లి మండల కేంద్రానికి అరకిలో మీటర్ దూరంలో ఏర్పాటుకు సర్వే చేయించి ప్రతిపాదించింది తానేనని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డా.రేకుపల్లి భూపతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కేంద్రం నవోదయ విద్యాలయం కేటాయిస్తే దానిని ఏర్పాటు చేయడంలో తన పాత్ర లేదని ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను భూపతిరెడ్డి ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపతిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం మూడుసార్లు జిల్లా కలెక్టర్ ద్వారా జక్రాన్ పల్లి మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేయించి ప్రతిపాదించింది తానేనని కానీ ఎంపీ కలిగోట్ వద్ద ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయడంతోనే అది తిరస్కరణకు గురైందని ఆరోపించారు. నవోదయ విద్యాలయం ఏర్పాటు వ్యవహరం దానికి సంబంధించిన ప్రత్యేక కమిటీ పరిశీలనతోనే జరుగుతుందని ఎంపీ కలిగోట్ వద్ద సూచించిన భూమి జాతీయ రహదారికి 12 కిలో మీటర్ల లోపల ఉందని వారు ఏర్పాటు ప్రతిపాదనలను తిరస్కరించారని గుర్తు చేశారు. 2022లోనే కేంద్రం కొత్త జిల్లాలలో నవదోయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరితే ఆనాటి నుంచి ఎంపీగా ఉన్న అరవింద్ చేసిన కృషి లేదని అందుకే 2024లో తమ ప్రభుత్వ హయంలో ఏర్పాటుకు తాము ముందుకు వచ్చామన్నారు. గతంలో అధికారులు చేసిన ప్రతిపాదనల్లోనే బోధన్ లో నవదోయ విద్యాలయం స్థల విషయం ఉందని దానిని కొత్తగా పంపించలేదని అధికారులే ఆ ప్రతిపాదన చేశారన్నారు. సీనియర్ నేతగా, ప్రజాప్రతినిధిగా సుదర్శన్ రెడ్డి బోధన్ లో నవోదయ విద్యాలయాన్ని ప్రతిపాదన చేయడంలో తప్పేమి ఉందన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాము రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నామన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో క్వింటాల్ కు రూ.25 వేల ధర వస్తుందని ప్రకటించిన ఎంపీ అరవింద్ ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ మేరకు తాము ఇస్తామన్న ధరలో ఎంపీ ఇచ్చిన హామీ సగానికి అమలు చేసిన రైతులకు లాభమేనని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ నాయకులు మునిపల్లి సాయిరెడ్డి తదితరులున్నారు.
