. . . వేగవంతమైన విద్యుత్ సేవల కోసం టీజీఎన్పీడీసీఎల్ చర్యలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో విద్యుత్ అంతరాయాలను త్వరితగతిన పరిష్కరించేందుకు టీజీఎన్పీడీసీఎల్ కొత్తగా హైడ్రాలిక్ లిఫ్టర్ వాహన సేవలను ప్రారంభించింది. వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో టాటా యోధా 3.0 ఎంటీ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు. ఈ వాహనం సహాయంతో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల బ్రేక్డౌన్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ (ఎఫ్ఓసి), చెట్ల కొమ్మల తొలగింపు, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్లు, పరికరాల నిర్వహణ పనులను మరింత సురక్షితంగా, వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయాలు ఏర్పడిన సమయంలో ఈ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం ద్వారా సిబ్బంది తక్షణమే స్పందించి సరఫరాను త్వరగా పునరుద్ధరించగలరని అధికారులు తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ సిబ్బంది భద్రతకు కూడా ఈ వాహనం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అత్యవసర నిర్వహణ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఈ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం కీలకంగా ఉపయోగపడుతుందని సూపరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడించారు.